ఇక స్వచ్ఛ భీమవరం!
Published Thursday, 1 December 2016భీమవరం, డిసెంబర్ 1: భీమవరం పట్టణం బహిరంగ మలమూత్ర విసర్జన రహితమని మున్సిపల్ కౌన్సిల్ ప్రకటించింది. దీంతో భీమవరాన్ని లిట్టర్ ఫ్రీగా పేర్కొనవచ్చు. ఇకనుంచి పట్టణంలో ఎక్కడా చెత్త వేయడం, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయడం నిషేధించారు. అంతేకాకుండా చెత్త నిర్మూలనకు ప్రత్యేకమైన జోన్లను కూడా ఏర్పాటుచేశారు. ఎవరు పడితే వారు ఎలా పడితే అలా ఇష్టానుసారం దుకాణాల వద్ద చెత్త వేయడం నిషేధం. గురువారం మున్సిపల్ కమిషనర్ సిహెచ్.నాగనరసింహారావు, అసిస్టెంట్ కమిషనర్ నాగేశ్వరరావు పట్టణంలో విస్తృతంగా పర్యటించి, తనిఖీలు చేశారు. స్థానిక బుధవారం మార్కెట్లో బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. రూ.100 అపరాధ రుసుం విధించారు. పట్టణ పారిశుద్ధ్య మెరుగునకు ప్రజలంతా సహకరించాలని కమిషనర్ కోరారు.