వైద్య విద్యార్థిని ఆత్మహత్య
Published Friday, 2 December 2016రాజమహేంద్రవరం, డిసెంబర్ 1: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని జిఎస్ఎల్ వైద్య కళాశాల విద్యార్థిని హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యచేసుకుంది. బుధవారం సాయంత్రం ఈ ఘటన జరగగా, చికిత్స పొందుతూ అర్థరాత్రి దాటాక మృతి చెందింది. విశాఖపట్నంకు చెందిన రాచకొండ శుభశ్రీ (22) రాజానగరం జిఎస్ఎల్ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ నాలుగో సంవత్సరం చదువుతోంది. బుధవారం సాయంత్రం ఆమె కళాశాల భవనం నాలుగో అంతస్తు నుండి కిందకు దూకేసింది. తీవ్రంగా గాయపడిన ఆమెను కళాశాల ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ బుధవారం అర్థరాత్రి మృతిచెందింది. నార్త్జోన్ డిఎస్పీ రమేష్బాబు, రాజానగరం సిఐ శంకర్నాయక్ ఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరిపారు.
మృతురాలి తండ్రి రాచకొండ జగన్ ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉండటంతో కుటుంబం అక్కడే నివసిస్తోంది. శుభశ్రీ మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఢిల్లీ నుండి ఇక్కడకు వచ్చారు. కుమార్తె మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. మెరిట్ విద్యార్థిని అయిన తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోవాల్సిన ఆగత్యం ఏముందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. కాగా శుభశ్రీ గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు కళాశాల వర్గాలు చెబుతున్నట్టు సమాచారం. మృతురాలి తండ్రి జగన్ ఫిర్యాదుమేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.