ఫార్మాసిటీ ఏర్పాటుకు టిఎస్ఐఐసి కసరత్తు
Published Sunday, 4 December 2016హైదరాబాద్, డిసెంబర్ 3: ఫార్మాసిటీ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ (టిఎస్ఐఐసి) కసరత్తు చేస్తోంది. దీనికి మొత్తం 12,500 ఎకరాలు అవసరమని, ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా స్వీకరించి అమలు చేస్తోందని టిఎస్ఐఐసి చైర్మన్ జి బాలమల్లు తెలిపారు. శనివారం ఆయన టిఎస్ఐఐసి అధికారులతో కలిసి ఫార్మాసిటీ ప్రాంతాన్ని సందర్శించారు. హైదరాబాద్ శివారు కందకూరు మండలంలోని మీర్కచన్ పేట్, పంజగుట్ట, ముచ్చెర్ల గ్రామాలు, కడ్తాల్ మండలంలోని మిడ్విన్ తదితర గ్రామాల్లో భూమి సేకరణ ఉంటుందన్నారు. కాగా, మొదటి దశలో 5,643 ఎకరాలను సేకరించామని, మిగిలిన భూములను వీలైనంత త్వరలో సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పట్టాదర్లు, అసైన్డ్ భూముల యజమానులతో చర్చలు జరపాలని, చట్టప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్నారు. అలాగే శ్రీశైలం రహదారిపై కొత్తూరు గేట్ నుంచి మీర్కంపేట్ వరకు రోడ్డును నిర్మించాలని ఆర్అండ్బి అధికారులను ఆదేశించారు. ఫార్మాసిటీ ఏర్పాటైతే 1.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు.