150 కోట్లతో గురుకులాల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు
Published Sunday, 4 December 2016యలమంచిలి, డిసెంబర్ 3: రాష్టవ్య్రాప్తంగా ఉన్న గురుకులాల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు రూ.150 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు మంత్రి రావెల కిషోర్బాబు తెలిపారు. శనివారం విశాఖ జిల్లా యలమంచిలి మండలం కొక్కిరాపల్లి గురుకుల పాఠశాలలో ఆరుకోట్ల వ్యయంతో నిర్మించిన భవనాలను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ ప్రభుత్వం గురుకుల పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థుల ప్రగతికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. సొంత భవనాలు లేని గురుకులాలు ఒక్కో దానికి రూ.21 కోట్లతో కొత్త భవనాలు నిర్మిస్తున్నామన్నారు. మూడు నెలల్లో డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు అందజేస్తామన్నారు. ఎవరెస్ట్ అధిరోహణ కోసం 25 మంది విద్యార్థులకు మూడుకోట్లతో శిక్షణ ఇస్తున్నామన్నారు. గురుకులాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం కోసం అధిక శాతంలో నిధులు మంజూరు చేశామన్నారు. గురుకులాలు స్థాపించిన ఘనత ఎన్టీఆర్దని, అయితే అభివృద్ధి చేసింది చంద్రబాబేనన్నారు. కొక్కిరాపల్లి గురుకుల పాఠశాలను మోడల్ స్కూల్గా అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి సుందరపు విజయ్కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ జెడి రమణమూర్తి, కొక్కిరాపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పద్మకుమారి పాల్గొన్నారు.