వార్డు కమిటీల ఎన్నిక అసంబద్ధం -- మేం కార్పొరేటర్లం కాదా?
Published Sunday, 4 December 2016హైదరాబాద్, డిసెంబర్ 3: జిహెచ్ఎంసి కౌన్సిల్ శనివారం నిర్వహించిన వార్డు కమిటీల నియామకం ఏకపక్షంగా, ప్రతిపక్షాల గొంతు నొక్కే విధంగా జరిగిందని ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు మెట్టుశంకర్యాదవ్, సాయిజెన్ శాంతి ఆరోపించారు. నాచారం డివిజన్కు సంబంధించి కార్పొరేటర్ శాంతి మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశంతోనే అయిదుగురి పేర్లు పంపారని, తీరా ఎన్నిక సమయంలో వారి పేర్లు గల్లంతయ్యాయని ఆరోపించారు. కౌన్సిల్ సమావేశానికి హజరయ్యేందుకు ఉదయం రాగానే తాము ప్రతిపాదించిన పేర్లున్నాయా? అని మేయర్ను అడిగామని, ఏమైనా లోపముంటే వెంటనే సరిచేద్దామని చెప్పటంతో తాము కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యామని వారు వివరించారు. కౌన్సిల్ ముగిసిన తర్వాత తమకు మేయర్ నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవటంతో మేయర్ ఛాంబర్ ముందు బైఠాయించారు. మేయర్ బయటకు రావాలని? వార్డు కమిటీల ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయని కార్పొరేటర్లు నినాదాలు చేస్తూ ఛాంబర్ ముందు బైఠాయించారు. దాదాపు అరగంట తర్వాత పోలీసులు, సెక్యూరిటీ గార్డులు వారిని అక్కడి నుంచి పంపేందుకు ప్రయత్నించినా కుదరకపోవటంతో మేయర్ వారిని ఛాంబర్లోకి పిలిపించుకుని చర్చించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ల శంకర్యాదవ్, సాయిజెన్ శాంతి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ఉన్న కౌన్సిల్ అన్ని వర్గాలకు, అందరూ కార్పొరేటర్లు ఇచ్చిన పేర్లను పరిగణలోకి తీసుకుని వార్డు కమిటీలను ఏర్పాటు చేసిందని, కానీ ఇపుడు పాలక మండలి మాత్రం ఏకక్షపంగా నిర్ణయం తీసుకుందని, కనీసం డివిజన్ కార్పొరేటర్ సూచించిన వారికి వార్డు కమిటీలో స్థానం దక్కకపోతే బంగారు తెలంగాణలో అందరూ భాగస్వాములు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీని గెలిచిన తామిద్దరిని పార్టీలో చేర్చుకునేందుకు టిఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని, అందులో భాగంగానే తాము పంపిన వారికి స్థానం దక్కకుండా చేసి అగౌరవపరిచారని ఆరోపించారు. కాగా, వార్డు కమిటీల ఎన్నిక అధికార పార్టీ నేతలు, పాలక వర్గం ఇష్టారాజ్యంగా జరిగిందని బిజెపి కార్పొరేటర్ శంకర్యాదవ్ ఆరోపించారు.