ఫలించిన చర్చలు
Published Sunday, 4 December 2016హైదరాబాద్, డిసెంబర్ 3: విద్యుత్ శాఖకు చెంది ఉద్యోగులు తలపెట్టిన సమ్మెను శనివారం ఉపసంహరించుకున్నారు. రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీశ్రెడ్డి వద్ద జరిగిన చర్చలు ఫలించాయి. విద్యుత్ శాఖకు చెందిన ఉద్యోగుల సమస్యలపై 13 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మంత్రితో చర్చించారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను దశలవారీగా క్రమబద్దీకరించేందుకు మంత్రి అంగీకరించారు. చర్చల తర్వాత మంత్రి స్వయంగా ఈ విషయం వెల్లడించారు. చర్చల తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాల నేతలతో జరిపిన చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని, ఉద్యోగుల సమస్యలపై కూలంకషంగా చర్చించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర కీలకమైందని గుర్తుచేస్తూ, బంగారు తెలంగాణ సాధనలో కూడా విద్యుత్ ఉద్యోగులు భాగస్వాములు కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అందుకే సమస్యలు ఎలాంటివైనా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని వివరించారు. ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులు సుమారు 28 వేల మంది ఉంటారని, వీరిని దశలవారీగా క్రమబద్దీకరిస్తామని వెల్లడించారు. ఈ శాఖకు చెందిన ఉద్యోగుల ఇతర సమస్యలను అధికారులతో చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు అంగీకారం కుదిరింది. మంత్రి జగదీశ్రెడ్డితో జరిపిన చర్చల ఫలితాలు సంతృప్తిని ఇచ్చాయని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పారు. ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు అంగీకరించినందుకు వారు మంత్రికి, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.