రాబోయే కాలంలో సమర్ధవంతంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్
Published Wednesday, 24 June 2015* సింగ్పూర్ ప్రతినిధులకు వివరించిన కమిషనర్ వీరపాండియన్
విజయవాడ , జూన్ 23: విజయవాడ నగరంలో సాలిడ్వేస్ట్ మేనేజ్మెంట్ అమలుకు సమర్ధవంతంగా చర్యలు తీసుకోబోతున్నట్టు విఎంసి కమిషనర్ వీరపాండియన్ సింగ్పూర్ ప్రతినిధులకు వివరించారు. ఈసందర్భంగా మంగళవారం ఉదయం నగరంలో జరుగుతున్న శానిటేషన్, సాలిడ్వేస్ట్ మేనేజ్మెంట్ ల పరిశీలనకై విచ్చేసిన సింగ్పూర్ ప్రతినిధి బృందానికి తొలుత నగరంలో ప్రస్తుతం చేపడుతున్న శానిటేషన్ చర్యలను క్షేత్ర స్థాయిలో చూపించారు. ఈనేపథ్యంలో అజిత్సింగ్నగర్ లోని ఎక్సెల్ ప్లాంట్, గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, చెత్త నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే శ్రీరామ్ ప్లాంట్ లతోపాటు జక్కంపూడి ఏరియాలోని డంపింగ్ యార్డు పనితీరును పరిశీలింప చేసిన ఆయన ఆయా ప్లాంట్ల స్థితి గతులను వివరించారు. అలాగే భవిష్యత్తులో నగరంలో చేపట్టబోయే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చర్యలను కమిషనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సింగ్పూర్ ప్రతినిధులకు వివరించారు. నగర పర్యావరణ పరిరక్షణ తోపాటు భవిష్యత్తు తరాలకు కూడా ఆరోగ్య కరమైన గాలి, నీరు, వాతావరణాన్ని అందించాలంటే చెత్త సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించుకోవాలని సింగ్పూర్ ప్రతినిధులు కమిషనర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో విఎంసి ఎసిజి జి నాగరాజు, సిఎంహెచ్ఓ డాక్టర్ గోపినాయక్, సిఇ ఇన్చార్జ్ ఎంఎ షుకూర్, ఇఇ ధనుంజయ, ఎఎంహెచ్ఓ డాక్టర్ బాబూ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.