విసిల భర్తీకి సుప్రీం ఓకే
Published Saturday, 10 December 2016న్యూఢిల్లీ, డిసెంబర్ 9: తెలంగాణలో ఖాళీగావున్న మూడు వర్శిటీల వైస్ చాన్స్లర్ల నియామకానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన విసిల నియామకాలపై దాఖలైన పిటిషన్ను శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. తెలంగాణలో ఖాళీగావున్న మూడు వర్శిటీల విసి పోస్టుల భర్తీకి అనుమతించాలని, యూజిసి నిబంధనల ప్రకారమే నియామకం చేపడుతామని వాదించారు. గతంలో ప్రభుత్వం భర్తీ చేసిన విసిల నియామకాలను సవాల్ చేసిన పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ యూజిసి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు తోసిపుచ్చిన ధర్మాసనం, విసిల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది.