16 నుంచి అసెంబ్లీ
Published Saturday, 10 December 2016హైదరాబాద్, డిసెంబర్ 9: తెలంగాణ శాసనమండలి, శాసనసభ శీతాకాల సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ పేరిట శాసనమండలి (లెజిస్లేచర్) కార్యదర్శి డాక్టర్ ఎస్.రాజాసదారామ్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవుతాయి. ఈ నెల 23వ తేదీ వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అయితే ప్రతిపక్షాలు కోరితే నెలాఖరు వరకూ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అంటున్నారు.
13న పోలీసు అధికారులతో భేటీ
ఇలాఉండగా ఉభయ సభలు సమావేశం కానున్నందున భద్రతా ఏర్పాట్లపై సమీక్షించేందుకు 13వ తేదీ సాయంత్రం 4 గంటలకు శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్, శాసనసభ స్పీకర్ ఎస్. మధుసూదనా చారి పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం కానున్నారు. 15న స్పీకర్ అధ్యక్షతన జరిగే శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశంలో సమావేశాల అజెండాను ఖరారు చేస్తారు.