సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి
Published Saturday, 10 December 2016పాడేరు, డిసెంబర్ 9: ప్రజావాణిలో గిరిజనులు తెలియచేసే సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి పి.రవిసుభాష్ అధికారులను ఆదేశించారు. స్థానిక ఐ.టి.డి.ఎ. కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గిరిజనుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు తెలియచేసే సమస్యలలో పరిష్కారానికి అవకాశం ఉన్నటువంటివి సత్వరమే పరిష్కరించాలని చెప్పారు. గిరిజనుల నుంచి అందే సమస్యలను శాఖల వారీగా సమన్వయపరిచేందుకు కార్యాలయంలోని ఒక ఉద్యోగిని కో-ఆర్డినేటర్గా నియమించాలని ఆయన ఆదేశించారు. మండలానికి రెండు పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లు పెంచడానికి చర్యలు తీసుకోవాలని మండల విద్యాశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఆరోగ్యంపై ఐ.సి.డి.ఎస్. అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అన్నారు. ఉపాధి హామీ పథకం వేతనాలు సకాలంలో చెల్లించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐ.టి.డి.ఎ. సహాయ ప్రాజెక్టు అధికారి కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వేణుగోపాల్, జి.సి.సి. డివిజనల్ మేనేజర్ శర్మ, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.కమల, ప్రాజెక్టు ఉద్యానవన అధికారి ప్రభాకరరావు, వ్యవసాయ అధికారి ప్రసాద్, కాఫీ అసిస్టెంట్ డైరెక్టర్ రాధాక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.