సహాయక చర్యలు వేగవంతం
Published Saturday, 10 December 2016హైదరాబాద్, డిసెంబర్ 9: ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్కు తిరిగి చేరుకున్నారు. ఢిల్లీ నుంచే ఇక్కడి నానక్రామ్గూడలో ఏడంతస్తుల భవనం కూలిన ఘటనపై అధికారులను ముఖ్యమంత్రి ఫోన్లో అడిగి వివరాలు తెలుసుకున్నారు. జిహెచ్ఎంసి కమిషనర్ జనార్ధన్రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్తో అక్కడి నుంచే ఫోన్లో మాట్లాడారు. ఘటన స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను వేగవంతం చేసి క్షతగాత్రులను ఆదుకోవాలని మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ఘటనలో కూలీలు కొందరు మృతి చెందడం, మరి కొందరు తీవ్రంగా గాయపడటం పట్ల ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిందిగా అధికారులను సిఎం ఆదేశించారు.