రెండు మందుపాతర్ల నిర్వీర్యం
Published Saturday, 10 December 2016ముంచంగిపుట్టు, డిసెంబర్ 9: విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం బరడ పంచాయితీ బొడ్డాపుట్టు రహదారి మధ్యలో మావోయిస్టులు అమర్చిన రెండు మందుపాతర్లను శుక్రవారం పోలీసులు నిర్వీర్యం చేశారు. కూంబింగ్ చేసే పోలీసులను లక్ష్యంగా చేసుకుని గతంలో మావోయిస్టులు అమర్చిన అధునాతన మందు పాత్రలను పక్కా సమాచారంతో వెలికితీసినట్టు పోలీసులు తెలిపారు. ఈ నెల 6న రూఢకోట పోలీస్ ఔట్పోస్టుకు రెండు కిలోమీటర్ల దూరంలో మావోయిస్టులు అమర్చిన 20 కేజీల మందుపాతరను నిర్వీర్యం చేసిన సంఘటన మరువకముందే బరడ సమీపంలో బొడ్డాపుట్టు రోడ్డు మధ్యలో అమర్చిన మందుపాతర్లను బాంబ్ స్క్వాడ్ వెలికితీసి శుక్రవారం నిర్వీర్యం చేసింది. మూడు రోజుల వ్యవధిలో రెండు మండలాల్లోని మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టులు అమర్చిన శక్తివంతమైన మందుపాతర్లను పోలీసులు పక్కా సమాచారంతోనే వెలికితీశారు. ఈ మందుపాతర్లలో ఒకటి 15 కేజీలు, మరొకటి 2కేజీలు ఉన్నట్టు పాడేరు డిఎస్పీ మహేంద్ర తెలిపారు. ఇవి గనక పేలితే వంద గజాల మేర రోడ్డు ఛిద్రమయ్యేదన్నారు. డిఎస్పీతో పాటు పాడేరు సిఐ శ్రీనివాస్, ఎస్ఐ అరుణ్కిరణ్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.