వెంటాడుతూనే ఉన్న కరెన్సీ కష్టాలు
Published Thursday, 24 November 2016నిజామాబాద్, నవంబర్ 23: పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కరెన్సీ కష్టాలు ప్రజానీకాన్ని ఇంకనూ వెంటాడుతూనే ఉన్నాయి. పాత 500, 1000రూపాయల నోట్ల చెలామణిని రద్దుచేసి పక్షం రోజులు పూర్తయినప్పటికీ, పరిస్థితి కుదుటపడకపోవడంతో సామా న్య జనాలంతా బ్యాంకులు, ఎటిఎంల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అయితే మొదటివారం పదిరోజులతో పోలిస్తే ప్రస్తుతం బ్యాంకుల వద్ద కాస్తంతగా క్యూ లైన్లు తగ్గడం స్వల్ప ఊరటనిస్తున్నప్పటికీ, ఏదో ఒక రకంగా కరెన్సీ కష్టాలు మాత్రం ఎదురవుతూనే ఉన్నాయని సగటు జీవులు వాపోతున్నారు. చివరకు వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పెద్ద నోట్ల రద్దు వ్యవహారం రైతులనూ కుంగదీస్తోంది.