S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం కాలువ పనులు పూర్తి చేయండి

నూజివీడు, జూలై 4: పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రంగం సిద్ధణ చేస్తున్నారని, బుధవారం నీరు విడుదల చేస్తారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పనులు వేగవంతం చేయాలని అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం మండలంలోని సీతారామపురంలో జరుగుతున్న పనులను మంత్రి పరిశీలించారు. రామిలేరు, తమ్మిలేరుపై జరుగుతున్న పనులను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు.

టాటా ట్రస్ట్ సహకారంతో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పరుచుకోవాలి

నందిగామ, జూలై 4: విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టాటా ట్రస్ట్ ప్రతినిధులు అందిస్తున్న సేవలను ఉపయోగించుకొని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పరుచుకోవాలని పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) అన్నారు. టాటా ట్రస్ట్ సౌజన్యంతో మండలంలోని చందాపురం గ్రామంలో నూరు శాతం మరుగుదొడ్ల నిర్మాణం జరగ్గా సోమవారం బందరు ఎంపి కొనకళ్ల నారాయణ, నందిగామ, జగ్గయ్యపేట ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో మొక్కలు నాటి ఇంకుడు గుంట నిర్మాణ పనులు ప్రారంభించారు.

పేదల గుండె చప్పుడు ‘రంగా’

మచిలీపట్నం, జూలై 4: వంగవీటి మోహన రంగా పేద ప్రజల గుండె చప్పుడని, దానికి చావు లేదని రంగా తనయుడు, వైఎస్‌ఆర్ సిపి నాయకుడు వంగవీటి రాధా అన్నారు. రంగా అంటే ఒక కుల నాయకుడు కాదన్నారు. కులం ఆయన బలం మాత్రమేనన్నారు. ఆ బలం పది మందికి మేలు చేకూరేలా ఉంటుందే తప్ప హాని చేకూర్చదని అభిమానుల హర్షధ్వానాల మధ్య అన్నారు. స్థానిక నిజాంపేటలో ఇటీవల కూల్చివేతకు గురై రంగా విగ్రహ స్థానంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని సోమవారం రాత్రి రాధా ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొనడం విశేషం.

ఈపోస్‌తో అర్హులకు సంక్షేమ పథకాలు

హనుమాన్ జంక్షన్, జులై 4: దేశంలో తొలిసారిగా కృష్ణా జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈపోస్ విధానంతో అర్హులకు మాత్రమే సంక్షేమ పథకాలు అందుతున్నాయని జిల్లా కలెక్టర్ బాబు ఎ కేంద్ర బృందానికి వివరించారు. జిల్లాలో ఈపోస్ విధానాన్ని పరిశీలించేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఉన్నత స్థాయి అధికారుల బృందం సోమవారం గన్నవరం నియోజకవర్గంలో పర్యటించింది. నియోజకవర్గంలోని బాపులపాడు మండలం పెరికీడు, ఆరుగొలను గ్రామాలలో ఈపోస్ అమలుతీరును క్షేత్ర స్థాయిలో బృందం సభ్యులు పరిశీలించారు.

సాగునీరు విడుదల సఫలీకృతమయ్యేనా..?

అవనిగడ్డ, జూలై 4: రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ఖరీఫ్ సాగుకు ఈనెల 10లోపు సాగు నీరు విడుదల చేస్తామని చేసిన ప్రకటన ఏ మేరకు సఫలీకృతం అవుతుందనేని రైతాంగానికి ప్రశ్నార్ధకంగా మారింది. డెల్టా ఆధునీకరణ భాగంగా దివిసీమలో భారీగా పనులు జరుగుతున్నాయి. కాలువలు తవ్వి ఎక్కడ మట్టి అక్కడే పెద్ద ఎత్తున గుట్టలుగా పోసి ఉన్నాయి. ముఖ్యంగా దివి మెయిన్ కెనాల్‌కు రివిట్‌మెంట్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో రోడ్డుకు, రివిట్‌మెంట్‌కు మధ్యలో పూడికకు గాను కాలువలో మట్టిని పెద్ద పెద్ద గుట్టలుగా సిద్ధం చేశారు.

కలెక్టర్ వస్తేనే మీరూ వస్తారా...?

మచిలీపట్నం, జూలై 4: కలెక్టర్ వస్తేనే మేమూ వస్తాము అనే ధోరణిని జిల్లా అధికారులు విడనాడాలని జిల్లా రెవెన్యూ అధికారి చెరుకూరి రంగయ్య అన్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ‘మీకోసం’కు జూనియర్ అసిస్టెంట్స్ వస్తే సమస్యలు పరిష్కారం కావని, జిల్లా అధికారులంతా విధిగా హాజరు కావాలన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’లో పాల్గొన్న ఆయన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఓ మాట్లాడుతూ చాలా మంది జిల్లా అధికారులు కలెక్టర్ వచ్చిన రోజునే వస్తున్నారని, మిగిలిన రోజుల్లో జూనియర్ అసిస్టెంట్స్‌ను పంపించి చేతులు దులుపుకుంటున్నారన్నారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు.

ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూలై 4: స్థానిక 30వ వార్డు దళితవాడలో ఆ ప్రాంత మహిళల అవసరార్ధం ప్రభుత్వం నిర్మించిన మరుగుదొడ్లను కూల్చి వేసి ఆక్రమణకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత బహుజన పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా పరిరక్షణ సంఘం నాయకులు అన్నవరపు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆర్‌ఎస్ నెం. 264లోని ఎనిమిది సెంట్ల ప్రభుత్వ భూమిలో గతంలో దళిత మహిళల అవసరార్ధం మరుగుదొడ్లు నిర్మించారన్నారు. ఇటీవల కాలంలో ఆ వార్డు మాజీ కౌన్సిలర్, తెలుగుదేశం పార్టీ నాయకుడు బోలెం హరిబాబు మరుగుదొడ్లను కూల్చి వేసి సదరు స్థలాన్ని ఆక్రమించాడని ఆరోపించారు.

అవినీతికి కేరాఫ్ అడ్రస్ మోదీ, చంద్రబాబు

మచిలీపట్నం, జూలై 4: అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోది, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అంతా అవినీతి పంథాలో సాగుతోందన్నారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మోడీ, చంద్రబాబు నిరంకుశ పాలనపై ధ్వజమెత్తారు. కాసులకు కక్కుర్తి పడి అభివృద్ధిని కాలరాస్తున్నారన్నారు. విదేశీ పర్యటనలతో కాలక్షేపం, అరచేతిలో వైకుంఠం చూపిస్తూ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.

శ్రీ అనంత ఆదిశేష భగవానుడికి అభిషేకాలు

కూచిపూడి, జూలై 4: నిరంతరం హరినామ సంకీర్తనతో ఓలలాడుతున్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పెదముత్తేవి శ్రీకృష్ణాశ్రమంలో సోమవారం శ్రీ అనంత ఆదిశేష భగవానుడి అభిషేకానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. జేష్టబహుళ అమావాస్య సందర్భంగా శ్రీ ఆదిశేష భగవానుడి అభిషేకాన్ని ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ ముత్తీవి సీతారాం గురుదేవులు, కమల దంపతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పండితుల వేదమంత్రాలు, భక్తుల వాసుదేవ నామస్మరణలు, శ్రీసూక్తం, పురుష సూక్తం, రుద్రసూక్తం వంటి పంచ సూక్తాల నేపథ్యంలో శ్రీ సీతారాం గురుదేవులు శ్రీ అనంత ఆదిశేష భగవానుణ్ణి అభిషేకించారు.

కూరగాయల మార్కెట్‌లో ఉద్రిక్తత

తిరువూరు, జూలై 4: స్థానిక సర్దార్‌పేట బాపయ్య కూరగాయల మార్కెట్‌లో దుకాణాల వేలం విషయంలో వివాదంతో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. వేలం అక్రమమని కొందరు దుకాణాదారులు, నిబంధనల ప్రకారమే వేలం నిర్వహించామని పంచాయతీ సిబ్బంది చెప్పగా వారికి మరికొందరు దుకాణదారులు వత్తాసు పలకడంతో వివాదం నెలకొంది. మార్కెట్‌లోని 37 దుకాణాలకు ఈ నెల 1న బహిరంగ వేలం నిర్వహించగా 14 దుకాణాలు పాడుకున్నారని, మిగతా దుకాణాల వేలం వాయిదా పడినట్లు సీనియర్ అసిస్టెంట్ కామేశ్వరరావు తెలిపారు. 21వ నంబరు షాపుతో వివాదం నెలకొందన్నారు.

Pages