S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీక్ష విరమించవద్దని షర్మిలకు బెదిరింపులు!

ఇంఫాల్: పదహారేళ్లుగా చేస్తున్న నిరాహార దీక్షను విరమించుకోవద్దని, బయటి వ్యక్తిని వివాహం చేసుకోవద్దని ‘మణిపూర్ ఉక్కుమహిళ’ షర్మిలకు కొన్ని సంస్థల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో సైనికులకు ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ 16 ఏళ్లుగా ఆమె దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల ఆమె కోర్టుకు హాజరైనపుడు మీడియాతో మాట్లాడుతూ, ఈనెల 9న నిరాహార దీక్ష ముగిస్తానని, వేరే ప్రాంతానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకుంటానని, రాజకీయాల్లో ప్రవేశిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె ప్రకటనపై మణిపూర్‌కు చెందిన కొన్ని సంస్థలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.

వాహనాలు తుడుస్తూ టిడిపి నిరసన

విజయవాడ: ఎపికి ప్రత్యేకహోదా ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. చెవిలో పూలు పెట్టుకుని కార్లు, బైక్‌లను వారు శుభ్రం చేశారు. హోదా విషయంలో బిజెపి తీరు సరిగా లేదని వారు విమర్శించారు. ప్రత్యేకహోదా ఇచ్చేంతవరకూ పలు రూపాల్లో తమ ఆందోళన కొనసాగుతుందని వారు ప్రకటించారు.

అస్సాంలో ఉగ్రదాడి: 12 మంది మృతి

గౌహతి: అస్సాంలోని కోక్రాఝార్‌లో శుక్రవారం ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. భద్రతాదళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతాదళాలు గాలింపుచర్యలను ప్రారంభించాయి. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రదాడికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ సిఎం సోనోవాల్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.

రేప్‌ కేసులో నిందితుడు జైలులో హత్య

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌ జిల్లాలో అత్యాచార ఆరోపణలతో జైలుకెళ్లిన నిందితుడిని ఖైదీలు దాడి చేసి చంపేసిన ఘటన చోటు చేసుకుంది. సుపేలా పోలీసుస్టేషన్‌ పరిధిలో అజయ్‌ దేవంగన్‌(34) అత్యాచార ఆరోపణలపై అరెస్టయ్యాడు. శుక్రవారం ఉదయం జైలు సిబ్బంది చూసేసరికి తనగదిలో చనిపోయి ఉన్నాడు. ఇద్దరు ఖైదీలు అతడిపై తీవ్రంగా కొట్టి చంపేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

రాజ్యసభ సోమవారానికి వాయిదా

దిల్లీ: కేవీపీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌ ఎంపీలు శుక్రవారం రాజ్యసభలో ఛైర్మన్‌ వెల్‌లోకి దూసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. దీంతో డిప్యూటీ ఛైర్మన్‌ కురియన్‌ సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

యాదాద్రిని ప్రత్యేక జిల్లా చేయాలి

నల్లగొండ: యాదాద్రిని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆధ్వర్యంలో టీడీపీ, సీపీఐ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి వైకుంఠద్వారం వరకు సాగింది. లక్ష సంతకాలతో కూడిన 10 వేల పోస్టు కార్డులను సీఎం కేసీఆర్కు పంపించారు. ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జిలాలను రప్పించాలని వారు డిమాండ్ చేశారు.

ముంబైలో భారీ వర్షాలు

ముంబైః శుక్రవారం ఉదయం నుంచీ ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైఃలో జన జీవనం స్తంభించిపోయింది. పలు రైళ్ళు, విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఎయిర్ పోర్ట్ , రోడ్లు, రైల్వే ట్రాక్ ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆఫీసులు, స్కూళ్ళకు వెళ్ళాల్సిన జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పశ్చిమ, మధ్య రైల్వే కు చెందిన అనేక సబర్బన్ రైళ్ళు గంటలకొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే ట్రాక్ లపై వరద నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మల్లన్నసాగర్ రైతులతో రేపు ముఖాముఖి

హైదరాబాద్ : మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాల రైతులతో హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ఉదయం 11.30 గంటలకు ముఖాముఖి ప్రారంభమవుతుంది. బలవంతపు భూసేకరణపై హైకోర్టును ఆశ్రయించిన రైతులు, జస్టిస్ చంద్రకుమార్, టి. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతోపాటు వామపక్షాల నేతలు పాల్గొనున్నారు.

క్రిమిలేయర్ తో బీసీలకు అన్యాయం

హైదరాబాద్: క్రిమిలేయర్ కారణంగా బీసీలకు అన్యాయం జరుగుతోందని, ఈ అంశంపై త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలువనున్నట్లు కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు శుక్రవారం తెలిపారు. 27 శాతం రిజర్వేషన్ కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన బీసీ సంఘాలకు సూచించారు. రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో మంచి ఫ్యాకల్టీ, డైరెక్టర్ లేక సిలబస్ పూర్తి కాలేదని విమర్శించారు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌కు అధికారులు అవకాశం ఇవ్వకుంటే పార్లమెంట్ వద్ద గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతానని స్పష్టం చేశారు.

మరో వివాదంలో ట్రంప్ భార్య

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ మరో వివాదంలో ఇరుకున్నారు. రెండు దశాబ్దాల క్రితం ఓ మేగజైన్కు నగ్నంగా పోజిచ్చినప్పటి మెలానియా ఫొటోలను న్యూయార్క్ పోస్ట్ ఇటీవల ప్రచురించగా, 1995లో ఆమె అమెరికాకు వచ్చినప్పుడు వీసా నిబంధనలు ఉల్లంఘించారని తాజాగా ఆరోపణలు వచ్చాయి. అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తామని, వీసా నిబంధనలను మార్చాలని ప్రధానంగా ప్రచారం చేస్తున్న ట్రంప్ శిబిరానికిది ఇబ్బందికరంగా మారింది. మెలానియా స్వదేశం స్లొవేనియా. ట్రంప్కు ఆమె మూడో భార్య. 2005లో ఫ్లోరిడాలోని తన రిసార్ట్లో ట్రంప్ ఆమెను పెళ్లి చేసుకున్నారు.

Pages