సిఎం చంద్రబాబు దృష్టికి విధ్వంసక చర్యలు
Published Monday, 4 July 2016ఇంద్రకీలాద్రి, జూలై 3: కృష్ణ పుష్కరాలు, నగరాభివృద్ధి పేరుతో ఆలయాలను కూల్చివేస్తూ విధ్వంసక చర్యలకు పాల్పడి హిందూ ధర్మానికి విఘాతం కలిగిస్తున్న అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లినట్లు బిజెపి నేతలు తెలిపారు. మల్లిఖార్జున పేట గోశాల ఆవరణలో ఆదివారం ఉదయం బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, విలేఖర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నగరాన్ని అభివృద్ధి పేరుతో వివిధ ఆలయాలను ఆగమశాస్త్రానికి విరుద్ధంగా కూల్చివేస్తూ విగ్రహాలను వియంసి వ్యాన్లో తీసుకువెళ్లి తీవ్రమైన అపచారం చేస్తున్నట్లు వారు ఆరోపించారు.