లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు ఎప్పటికైనా ప్రమాదమే
Published Monday, 26 September 2016తిరుమల, సెప్టెంబర్ 25: భారీ వర్షాలు పడిన సందర్భంలో వరదనీరు ప్రవహించే లోతట్టు ప్రాంతాల్లో నివాసాలు ఉండటం ప్రజలకు ఎప్పటికైనా ప్రమాదమేనని ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం ఆయన తిరుమలకు విచ్చేశారు. ఆయన రాక సందర్భంగా టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఇఓ సాంబశివరావు, జెఇఓ శ్రీనివాసరాజు, జిల్లా కలెక్టర్ సిద్దార్థజైన్లు గవర్నర్కు సాదర స్వాగతం పలికారు. తిరుమల సంప్రదాయాన్ని పాటిస్తూ ఆయన ముందుగా వరాహస్వామి ఆలయానికి వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. అంతకుమునుపు గవర్నర్ శ్రీవారి పుష్కరిణికి వెళ్లి పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేసుకున్నారు.